టోల్ దెబ్బకి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడం మానేసిన వాహనాలు

  

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రాకపోకలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. దారిసుంకం బాదుడు భయంతో వాహనదారులు ఔటర్ ఎక్కేందుకు వెనుకాడుతున్నారు. సర్వీస్ రహదారులపై ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాల రాకపోకలు నగరంపై పడకుండా నిర్మించిన ఓఆర్ఆర్‌తో ఆశించిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. టోల్‌చార్జీలు అధికంగా ఉండడమూ సర్వీస్ రోడ్లపై ప్రయాణానికి కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సేవా రహదారులపై వాహనాలు ఎదురెదురుగా వస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

బాదుడు భయం... ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణానికి గేటుకో రేటు నిర్ణయించి మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అధికారులు టోల్ చార్జీలు నిర్ణయించారు. ఔటర్ పైకి ద్విచక్రవాహనాలు, ఆటో రిక్షాలకు ప్రవేశం లేకపోవడంతో ఇతర వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి కేటగిరీల వారీగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు టోల్‌ప్లాజాలు ఏర్పాటుచేసిన మార్గంలో కనీస చార్జీ రూ.40కాగా గరిష్ట చార్జీ రూ.400. పటాన్‌చెరు నుంచి పెద్దఅంబర్ వరకు మొదటి విడతగా 12టోల్‌గేట్లు ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో భారీ వాహనం వెళ్లాలంటే రూ.400 చెల్లించాల్సిందే. బాదుడు భయంతో భారీ వాహనదారులు సైతం సర్వీస్ రోడ్లను ఆశ్రయిస్తున్నారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో అడ్డుగా గుట్టలు, అడవులు ఉండడంతో ఔటర్ పక్కన నిర్మిస్తోన్న సర్వీస్ రోడ్లు అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో పక్కన ఉండే గ్రామాల ద్వారా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్ల నిర్మాణం మధ్యమధ్యలో నిలిచిపోయిన ప్రాంతాల్లో ఇరు వైపులా రహదారులను కలుపుతూ వంతెనలు నిర్మించడం లేదా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోవడం లేదు.

టోల్ ప్లాజాల నిర్వహణకు టెండర్ కరువు... రెండ విడతగా పటాన్‌చెరు నుంచి శామీర్‌పేట వరకు 36.5కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చింది. గత నెలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు ప్రారంభించారు. ఆ రోడ్డులో ఆరు టోల్‌ప్లాజాలు ఏర్పాటుచేయాలని భావించిన హెచ్ఎండీఏ వాటి నిర్వహణ కోసం నవంబర్‌లో టెండర్లు పిలిచింది. మొదట డిసెంబర్ 25వ తేదీని గడువుగా పేర్కొంటు నోటిఫికేషన్ జారీ చేయగా ఎవరూ టెండర్ వేయలేదు. దీంతో మరో పదిరోజులు గడువు పొడిగిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అహ్వానించారు.

అయినా ఇప్పటికీ టోల్‌ప్లాజాల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఔటర్‌పై వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయన్న ఆలోచనతో ఎవరూ టెండర్ దాఖలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది.


Author

Written by Admin

Aliquam molestie ligula vitae nunc lobortis dictum varius tellus porttitor. Suspendisse vehicula diam a ligula malesuada a pellentesque turpis facilisis. Vestibulum a urna elit. Nulla bibendum dolor suscipit tortor euismod eu laoreet odio facilisis.

0 comments: